ఆ ఏటీఎంలో రూ. 3వేలు డ్రా చేస్తే.. రూ.6వేలు అంతకుమించి ఇచ్చేస్తోంది!
గుంతకల్లులోని ఓ ఏటీఎంలో వినియోగదారులు తమకు కావాల్సిన సొమ్మును ఎంటర్ చేస్తే.. అంతకు మించి డబ్బును ఇచ్చేసింది.
అనంతపురం: ఇటీవల సాంకేతిక లోపం కారణంగా పలు ఏటీఎంలు వినియోగదారులు కోరుకున్నంత డబ్బులు కాకుండా.. అంతకుమించి ఇస్తున్నాయి. ఇప్పటి ఇలాంటి ఘటనలు తెలంగాణ, రాజస్థాన్, అసోం, మహారాష్ట్రల్లో చోటు చేసుకోగా.. ఇప్పుడు ఏపీలోని అనంతపురంలో జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
గుంతకల్లులో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానిక ఎస్బీఐ ఏటీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులకు విత్ డ్రా చేసుకోవాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది.
రూ.3 వేలు డ్రా చేసిన ఖాతాదారులకు రూ.6 వేలు, అంతకు మించి డబ్బు రావడంతో వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఓ ఖాతాదారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేశారు.
అక్కడికి చేరుకున్న బ్యాంకు అధికారులు ఆ ఏటీఎంను పరిశీలించి దానిని ఆపివేయడం జరిగింది. ఏ ఖాతాదారుడు ఎంత డబ్బు తీసుకున్నారనే విషయం సర్వర్ ద్వారా తెలుస్తుందని, ఎక్కువ మొత్తంలో తీసుకున్న డబ్బును తిరిగి వారి నుంచి తీసుకుంటామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.