ట్విట్టర్ ఆరోపణలు: నారా లోకేష్పై కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్పై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు, గూండాలు పాలిస్తున్నారని, ప్రజలకు శాంతి భద్రతలు కరువయ్యాయంటూ లోకేశ్ నవంబర్ 15న ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై న్యాయవాదులు రవికుమార్, అభిలాష్ రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. నారా లోకేశ్పై కేసు నమోదు చేయాల్సిందిగా ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
టిడిపి నాయకురాలిపై ఏసిపి భార్య ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తమ కుటుంబాన్ని కులం పేరుతో దూషించారని సుల్తాన్బజార్ ఏసిపి రవికుమార్ భార్య హుమాయున్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగర్ కాలనీ, ఇందిరానగర్లోని ప్రశాంత్ అపార్ట్మెంటులో టిడిపి నగర మహిళా నాయకురాలు సౌజన్యా కమాల్, ఏసిపి రవికుమార్ కుటుంబాలు ఉంటున్నాయి.
పార్కింగ్ విషయంలో ఇరుపక్షాల మధ్య గురువారం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కమాల్ ఫిర్యాదుతో ఏసిపి భార్య, కుమారులు, బావమరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గత నాలుగేళ్లుగా కమాల్ తమను కులం పేరుతో దూషిస్తున్నారని, ఇంటి ముందు నుంచి వెళితే నీళ్లుపోసి కడుక్కుంటున్నారని ఏసిపి భార్య గీతాశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కమాల్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ ఎస్ రవీందర్ తెలిపారు.