విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీపై కేసు నమోదు
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోసానికి పాల్పడ్డారని ఉత్తరాంధ్ర జెఏసి ప్రధానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జేఏసి నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రధానిపై కేసు నమోదు చేశారు. రైల్వే, జనరల్ బడ్జెట్లలో ఏపికి కేంద్రం అన్యాయం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అన్యాయం జరిగిందంటూ ఆందోళన బాట పట్టింది.
కాగా, సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరిలో ధర్మానకు దిగిన టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత సాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా బిజెపి పేరు చెబితేనే ఏపి ప్రజలు బాధపడుతున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోవలవరం ప్రాజెక్టు కోసం రూ. 1600 కోట్లు కావాలని అడిగితే.. 100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. అందుకే సిఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ కలిసి ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.