స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి: మనస్తాపంతో డ్రైవర్ ఆత్మహత్య
గుంటూరు: జిల్లాలో రెండు విషాద ఘటనలో చోటు చేసుకున్నాయి. ఓ చిన్నారి పాఠశాల బస్సు కింద ప్రాణాలు వదిలాడు. అయితే, తాను నడుపుతున్న బస్సు కింద పడి చిన్నారి మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బస్సు డ్రైవర్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఖాజీపేటకు చెందిన కాకాని సురేష్, వెంకటపద్మావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. కాగా, కొలకలూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారి కుమార్తె భవానీని తీసుకువెళ్లేందుకు నాయనమ్మతో కలిసి మూడేళ్ల కుమారుడు రఘురామ్ చరణ్ కూడా వచ్చాడు.
బస్సు దిగిన భవానీని నాయనమ్మ ఎత్తుకునేలోపే ఆ బాలుడు బస్సుకిందికి వెళ్లిపోయాడు. పాప దిగిందన్న ఉద్దేశంతో డ్రైవర్ పద్మప్రసాద్ (28) బస్సును ముందుకు నడపటంతో బాలుడు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో డ్రైవర్ను స్థానికులు ఆటోలో అతని స్వగ్రామం పెదకాకాని మండలం అనమర్లపూడి పంపారు.
కాగా, ఆ బాలుడు మృతికి తానే కారణమనే బాధతో ప్రసాద్ పాత గుంటూరు దగ్గర దిగి మిత్రులు కొందరికి ఫోన్ చేశాడు. పసిబాలుని మృతికి తానే కారణమని, వారు తనకు బంధువులని.. ఆ కుటుంబానికి ముఖం చూపించలేనని, తాను చనిపోతున్నానని వారికి చెప్పాడు.
అతడ్ని వారు వారించి, అతనున్న ప్రదేశానికి వచ్చేలోపే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ రెండు కుటుంబాలతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.