పోలీస్ స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్పై రేప్ యత్నం!
చిత్తూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఉద్యోగం చేస్తూ కీచకుడిలా వ్యవహరించాడు ఓ కానిస్టేబుల్. జిల్లాలోని కార్వేటినగరం మండలం కత్తెరపల్లెకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రామన్.. తిరుపతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అత్యాచారయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. రెండ్రోజుల క్రితం ముగిసిన తెలుగుదేశం మహానాడు సందర్భంగా ఎక్సైజ్ పోలీసులూ అక్కడికి బందోబస్తు విధులకు వెళ్లడంతో సదరు మహిళా కానిస్టేబుల్ ఒక్కరే శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రామన్.. పూటుగా మద్యం తాగి తనకు డ్యూటీ లేకున్నా ఎక్సైజ్ స్టేషన్కు వెళ్లాడు.
ఆ తర్వాత తన కామవాంఛ తీర్చమని ఆమెను బలవంతం చేశాడు. షాక్కు గురైన ఆమె.. ప్రతిఘటించి, కేకలు వేస్తూ అక్కణ్నుంచీ తప్పించుకున్నారు. దీంతో రామన్ కూడా పరారయ్యాడు.
విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందన్న కుటుంబసభ్యుల సూచనతో మూడు రోజులుగా ఫిర్యాదు చేయక మౌనంగా ఉన్న ఆమె.. చివరకు ధైర్యంచేసి సోమవారం సాయంత్రం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్పల్లె సీఐ మధు తెలిపారు. కాగా, కానిస్టేబుల్ రామన్ను సస్పెండు చేసినట్టు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నాగబద్దయ్య తెలిపారు.
యువకుడి కిడ్నాప్: డబ్బులు డిమాండ్
పశ్చిమగోదావరి: డబ్బు కోసం ఓ యువకుడిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివరావుపేటకు చెందిన కఠారి శ్రీనివాసరాజు కుమారుడు కఠారి సత్యశివకృష్ణవర్మకు చింతా చంద్రశేఖర్(చందు) రూ. 25 వేలు క్రికెట్ పందేల నిమిత్తం ఇవ్వాల్సి ఉంది.
ఆ డబ్బు ఇస్తాను రమ్మని ఆదివారం వర్మకు చందు ఫోన్ చేశాడు. కారులో ఝాన్సీలక్ష్మిభాయి స్కూ సమీపంలోకి వర్మ వెళ్లేసరికి అక్క్డడే కారులో కాపుకాసిన చందు, తోట స్వామినాయుడు, కొప్పర్తి నాగరాజు ఆ యువకుడిని బలవంతంగా కారులోకి లాక్కుని శృంగవక్షం తీసుకెళ్లారు.
అనంతరం సత్యశివకృష్ణవర్మ తండ్రి శ్రీనివాసరాజుకి చందు ఫోన్ చేసి 'రూ.12 లక్షలు ఇస్తే మీ కుమారుడిని విడిచిపెడతాం'అంటూ బెదిరించారు. దీంతో శ్రీనివాసరాజు తన వద్ద రూ.4 లక్షల 25 వేలే ఉన్నాయని, తన కుమారుడిని విడిచిపెట్టాలని వేడుకోవటంతో ఆ డబ్బు ఎక్కడికి తీసుకురావాలో చందు ఫోన్చేసి చెప్పాడు.
జువ్వలపాలెం రోడ్డులో ఓ యువకుడిని పంపించి ఆ డబ్బు తీసుకున్నాక కొంతదూరంలో సత్యశివకృష్ణవర్మను విడిచిపెట్టారు. సోమవారం శ్రీనివాసరాజు తన కుమారుడితో కలిసి పోలీ స్స్టేషన్కు చేరుకుని కిడ్నాపర్లపై ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.