తెలంగాణలో భార్యాబిడ్డలు: ఏపిలో వైద్యుడి ఆత్మహత్య
అనంతపురం: ఒంటరి తనన్ని భరించలేక ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యాబిడ్డలు హైదరాబాద్లో ఉంటుండగా.. అతనికి అనంతపురంలో పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. కుటుంబసభ్యులను వదిలి ఉండలేకపోయిన ఆ వైద్యుడు, తన సొంతరాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అతని విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై చివరకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రభుత్వ వైద్యుడు గిరిధర్(46). అనంతపురం జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్లో తనకు కేటాయించిన ప్రభుత్వ నివాసగృహంలో ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని గిరిధర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన గిరిధర్ ఏడాది క్రితం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి బదిలీపై వచ్చారు.
ఇక్కడ చిన్నపిల్లల విభాగంలో డాక్టర్గా విధులు నిర్వర్తిసున్నారు. ఆయన భార్యాబిడ్డలు హైదరాబాద్లో నివాసముంటున్నారు. గిరిధర్ భార్య హైదరాబాద్లో గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. డాక్టర్ గిరిధర్ పదిరోజులకోసారి హైదరాబాద్ వెళ్లి వస్తుండేవారు.
కాగా రాష్ట్ర విభజన దృష్ట్యా తనను తమ ప్రాంతానికి బదిలీ చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని వైద్య శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూ వచ్చారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతాధికారులతోనూ ఇదే విషయం స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం భార్యాబిడ్డలను చూసేందుకు ఆయన హైదరాబాద్కు వెళ్లి మంగళవారం తిరిగి వచ్చారు.
బుధ, గురువారాల్లో విధులకు హాజరయ్యారు. ఆయన భార్య గురువారం సాయంత్రం గిరిధర్ సెల్ఫోన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని రావడంతో.... గిరిధర్ బావమరిది తాడిపత్రి నుంచి హుటా హుటిన అనంతపురం చేరుకున్నాడు. డాక్టర్ నివాసముంటున్న ఇంటి వెనుక కిటికీ తీసి చూస్తే లోపల గిరధర్ ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది. లోపల దుర్గంధం వస్తూండడంతో గిరిధర్ గురువారం రాత్రే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సంఘటనా స్థలంలో ఆత్మహత్యకు ముందు గిరిధర్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘భార్యాపిల్లలను వదిలి ఉండలేకపోతున్నాను. ఇలాంటి బాధలు మరెవరికీ రాకూడదు. జై తెలంగాణ' అని సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు వైద్యులు అక్కడికి చేరుకుని తమను తమ ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.