అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడుతూ 5వ అంతస్తు నుంచి పడింది
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా నిలబడిన ఆ యువతి ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో విషాదం నింపింది.ఫోన్ మాట్లాడుతూ ఐదో అంతస్తు నుంచి కిందపడిన ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రకాశం: బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా నిలబడిన ఆ యువతి ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో విషాదం నింపింది. ఫోన్ మాట్లాడుతూ ఐదో అంతస్తు నుంచి కిందపడిన ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో త్రిపుర అనే 21ఏళ్ల యువతి తాము ఉంటున్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు గోడపై కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి జారిపడింది.
పెద్ద శబ్ధం రావడంతో కింద ఫ్లోర్లో ఉంటున్న వారు బయటకొచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న త్రిపుర కనిపించింది. అప్పటికే ఆమె మరణించినట్లు గుర్తించిన వారు.. వెంటనే త్రిపుర కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
కిందికి వచ్చి చూసిన త్రిపుర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.