‘ఒకే నెం.కు 3600సార్లు ఫోన్: ఆ యువతి అపహరణ అంతా బూటకమే’
విశాఖపట్నం నగరంలో బుధవారం యువతి అపహరణకు గురైందని నమోదైన కేసును పోలీసులు బూటకంగా నిర్ధరించారు.
విశాఖపట్నం: నగరంలో రెండ్రోజుల క్రితం యువతి అపహరణకు గురైందని నమోదైన కేసును పోలీసులు బూటకంగా తేల్చారు. బాధితురాలు లక్ష్మీవాసంతి(22) గురువారం ఉదయం 8.45 గంటలకు ఇంటికి చేరుకోవడంతో ఎలాంటి అపహరణ చోటుచేసుకోలేదని వివరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నగర సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ఖాన్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. కొత్త నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన సుంకర మహాలక్ష్మి తన కుమార్తె లక్ష్మీవాసంతి అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు.
మొదటిగా బాధితురాలి వద్ద ఉన్న సెల్ఫోన్ నుంచి వచ్చిన సందేశం ఆధారంగా టవర్ సిగ్నల్ లొకేషన్ చూడగా విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు వచ్చిందని పేర్కొన్నారు. దీంతో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేయగా అక్కడ నుంచి కొత్తూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని వివరించారు.
అక్కడ నుంచి నేరుగా ఎన్హెచ్-16 మీదుగా గుంటూరు జిల్లా రావడంతో విచారణ మరింత లోతుగా చేశామని తెలిపారు. బాధితురాలి ఫోన్ నుంచి సమాచారం సేకరించగా గత మూడున్నర నెలల నుంచి ఒకే నెంబర్కి 3,600 సార్లు ఫోన్ చేసినట్టు గమనించామని పేర్కొన్నారు. దీంతో ఆ కోణంలో విచారించామన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8.45గంటలకు లక్ష్మీవాసంతి ఇంటికి చేరుకుందన్నారు. దీంతో దీన్ని బూటకపు అపహరణగా ఉందని వివరించారు.
కాగా, విషయం తెలిసిన వెంటనే మల్కాపురం పోలీసులు లక్ష్మీవాసంతితో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లారు. అయితే ఆమె తల్లిదండ్రులు ఇందుకు సమ్మతించకపోవడంతో వెనుతిరిగారు.
అయితే, పోలీసుల దర్యాప్తులో లక్ష్మీవాసంతి గత మూడున్నర నెలల్లో 994958.... నంబర్కు 3,600 ఫోన్ కాల్స్ చేసినట్టు గుర్తించారు. ఆ నంబర్ ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిదని తేలింది. దీంతో ఆమె కిడ్నాప్ ఉదంతంపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు జాయింట్ సీపీ సత్తార్ఖాన్ తెలిపారు. యువతి తల్లిదండ్రులకు ఏదైనా అనుమానం వున్నట్టయితే వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.