కోరిక తీర్చాలంటూ వేధింపులు, వినలేదని కత్తితో పొడిచాడు
తనతో వివాహేతర సంబంధం పెట్టుకోలేదని ఆగ్రహించిన ఓ యువకుడు అంగన్ వాడీ ఆయాపై కత్తితో దాడిచేసిన సంఘటన శనివారం రాత్రి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోంది.
కూచిపూడి: తనతో వివాహేతర సంబంధం పెట్టుకోలేదని ఆగ్రహించిన ఓ యువకుడు అంగన్ వాడీ ఆయాపై కత్తితో దాడిచేసిన సంఘటన శనివారం రాత్రి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోంది.
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెడసనగల్లు గ్రామంలో స్వరూపరాణి అంగన్ వాడీ ఆయాగా పనిచేస్తోంది.ఆమెకు 18 ఏళ్ళ క్రితమే వివాహమైంది. భర్త మరణించడంతో తల్లి సుశీల వద్దే ఆమె నివాసం ఉంటుంది.
ఓ కుమార్తైకు ఆమె ఇటీవల వివాహం చేసింది. మరో కుమార్తె చల్లపల్లి వసతిగృహంలో ఉంటూ చదువుతోంది. అంగన్ వాడీలో ఆయాగా పనిచేస్తూ కుటుంబ పోషణ నిమిత్తం ఓ కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తోంది.
స్వరూపరాణి కిరాణదుకాణం నిర్వహించే ఇంటి యజమాని కొడుకు సురేష్ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె కిరాణదుకాణాన్ని తన ఇంటివద్దకే మార్చుకొంది.అయినా సురేష్ ఆమెను వేధించడం మాత్రం మానలేదు.
తన కోర్కెను తీర్చకపోతే చంపేస్తానని ఆమెను బెదిరించేవాడు.శనివారం నాడు రాత్రి స్వరూప ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్న ఆమెను తలుపు తీయాలని అడిగాడు. ఆమె తలుపు తీయకపోవడంతో తలుపును ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి ఆమెపై కత్తితో దాడి చేశాడు.
దీంతో స్వరూప కేకలు వేసింది.ఇరుగుపొరుగు వారు రావడంతో సురేష్ పారిపోయాడు.స్వరూపరాణిని 108 లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.