దారుణం: అప్పు తీర్చలేదని వివాహితను నెలరోజులపాటు నిర్బంధించారు
అనంతపురం: జిల్లాలోని కదిరిలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తీసుకున్న అప్పును తీర్చలేదంటూ తమ వద్ద సొమ్ము తీసుకున్న ఓ వ్యక్తి భార్యను నెలరోజులుగా వడ్డీ వ్యాపారులు నిర్బంధించారు.
వివరాల్లోకి వెళితే.. పుష్ప, రఫీ దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వీరి వద్ద నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో సొమ్మును చెల్లించలేదనే నెపంతో చంద్రశేఖర్ భార్య రంజితను నెలరోజుల పాటు తమ ఇంట్లో నిర్బంధించి హింసించారు.
కాగా, బంధువుల సాయంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దొంగల ముఠా అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. దొంగల నుంచి రూ. 26,62,000ల విలువైన రెండు బొలేరోలు, ఒక ఇండికా కారు, ఒక టాటా ఏస్ వాహనాలతోపాటు 8 బైకులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాకు చెందిన ప్రేమ్కుమార్(25), జయప్రకాశ్(35), రవి(36), రాజ్కుమార్(21)లను అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.