ప్రేమ: పెళ్లాడమంటే యువతిపై బ్లేడుతో దాడి చేశాడు
విశాఖపట్నం: ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకుని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. నిందితుడు ఓ సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మాడుగలకు చెందిన ఓ యువతి నర్సు ట్రైనింగ్ తీసుకుంటూ విశాఖలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. అనకాపల్లి సమీపంలోని తాళ్లపాలెం గొబ్బూరుకు చెందిన కుమార్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ యువతి వెంటపడ్డాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శరీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత విధుల నిమిత్తం వెళ్లిపోయాడు. కాగా, ఏప్రిల్ 28న జమ్మూ నుంచి వచ్చిన కుమార్ ఆ యువతిని కలిశాడు.
తన ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ను ఆమె వద్దే ఉంచి, తన గ్రామానికి వెళ్లాడు. మే 3న విశాఖకు తిరిగి వచ్చాడు. పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పి.. తానిచ్చిన మొబైల్, ఐడీ కార్డు ఇస్తే వెళ్లిపోతానని ఆమెతో చెప్పాడు. దీంతో తనను నమ్మించి ఎందుకు మోసం చేశావని నిలదీసింది. ఆమె ఎదురుతిరగటంతో జేబులోంచి బ్లేడు తీసిన కుమారు.. ఆమె ముఖం మీద కోసేయబోయాడు.
ఆమె చేతులు అడ్డుపెట్టడంతో చెయ్యి తెగిపోయింది. రక్తరావడంతో వెంటనే కుమార్ అక్కడ్నుంచి పారిపోయాడు. బాధితురాలు తన అక్క ఇంటికి వెళ్లి, మహిళా సంఘాల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స చికిత్స చేయించుకున్న బాధితురాలి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.