మేయర్ హత్య: వైసిపి నేతల ఇళ్లల్లో సోదాలు, చింటూ ఇంట్లో 4 కత్తులు
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేస్తున్నారు. అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు గురువారం నాడు పలువురు అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
గురువారం నాడు పోలీసులు దాదాపు పదిమంది అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. చింటూ అనుచరుల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. విజయానంద రెడ్డి, శ్రీధర్, బుల్లెట్ సురేష్, ఏకాంబరం, గుర్పప్ప నాయుడు, వీరేష్, శివ తదితరుల ఇళ్లలో సోదాలు చేశారు.
ఇందులో విజయానంద రెడ్డి, శ్రీధర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అని తెలుస్తోంది. రాష్ట్ర బిసి సంఘం నేత ఇంట్లోను పోలీసులు సోదాలు నిర్వహించారు. చింటూ అలియాస్ చంద్రశేఖర్ నివాసంలో పోలీసులు సోదా చేసి.. నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక, గుర్రప్ప.... మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ప్రధాన అనుచరుడు. బుల్లెట్ సురేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీరి ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనూరాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి 11 మంది నిందితులు ఉన్నారు.
కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. దాదాపు 40 మందికి నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. చింటూ, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు ఇటీవల కూడా సోదాలు నిర్వహించారు. తాజాగా మరోసారి సోదాలు చేశారు.