ఏడుపు ఆపడం లేదని కొట్టిన తల్లి: చిన్నారి మృతి
చిత్తూరు: ఓ తల్లి క్షణికావేశం తన 8 నెలల కొడుకు ప్రాణాలను బలి తీసుకుంది. మంచంపై నుంచి కిందపడి నొప్పితో ఏడుస్తున్న కొడుకు ఎంతకూ తన ఏడుపును ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన తల్లి.. అతడ్ని గట్టిగా కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాధ ఘటన చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మోహన్ కుమార్, కరిష్మాలకు ఏడాది కింద వివాహం జరిగింది. వీరికి ప్రభాస్ అనే 8 నెలల కొడుకు ఉన్నాడు. సోమవారం ఉదయం అతడు మంచంపై నుంచి కిందపడ్డాడు. దెబ్బ తగలడంతో తీవ్రంగా ఏడుస్తున్నాడు.
కాగా, ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో అసహనానికి గురైన తల్లి కరిష్మా.. కొడుకు చెంపపై బలంగా కొట్టింది. దీంతో నోరు, చెవిలో నుంచి రక్తం కారి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
తన భార్యే కొడుకును కొట్టి చంపిందని కరిష్మా భర్త మోహన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కరిష్మాను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను క్షణికావేశంలో తన కొడుకును కొట్టానని, చంపాలని అనుకోలేదని కరిష్మా కన్నీరుమున్నీరైంది.