హడల్: దెయ్యం భయంతో మూతపడిన పాఠశాల
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఓబర్తిలో దెయ్యం ఉందనే భయంతో ఓ బడికి తాళం పడింది. 15 రోజుల క్రితం వరకు బడి విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేదని శనివారం వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత పాఠశాల పేరు ఎత్తితేనే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
దీంతో విద్యార్థులు లేకుండా పాఠశాల ఖాళీగా దర్శనమిస్తోందని వార్తలు వచ్చాయి అయితే స్కూల్కు వెళ్లకపోవడానికి గల కారణాన్ని విద్యార్థులు భయంగా చెబుతున్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను అక్కడ దగ్గర్లో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. స్కూలుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి.
దీంతో దెయ్యంగా మారిన భీములమ్మ తమను భయపెడుతోందంటూ విద్యార్థులు అంటున్నట్లు కూడా స్థానిక మీడియా రాసింది. అటుగా వెళ్లిన వారిపై రాళ్లు రువ్వుతోందని చెబుతున్నారు. దెయ్యంగా మారిన భీములమ్మ ఓ ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని సైతం తగులబెట్టారు. అప్పటి నుంచి మరింతగా భయపెడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
దీంతో పిల్లలకు ఎంత నచ్చజెప్పినా బడికి వెళ్లడం లేదంటున్నారు. టీచర్లు వచ్చినా ఎంత నచ్చజెప్పినా విద్యార్థులు మాత్రం స్కూల్ వైపు కన్నెత్తైనా చూడటం లేదని మీడియా రాసింది.