లాడ్జీలో బ్లేడుతో కోసుకుని ‘రెడ్డీస్ లేబొరేటరీస్’ శాస్త్రవేత్త ఆత్మహత్య
విశాఖపట్నం: ఓ యువ శాస్త్రవేత్త గాజువాకలోని లాడ్జీ గదిలో బుధవారం తెల్లవారుజామున బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఇమ్మానుయేలు రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హన్మకొండ దరి వడ్డేపల్లికి చెందిన లింగంపల్లి వేణుగోపాల్రెడ్డి (30) కుత్బుల్లాపూర్(హైదరాబాద్)లోని రెడ్డీస్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.
కాగా, విధి నిర్వహణలో భాగంగా మంగళవారం విశాఖపట్నంలోని దువ్వాడ యూనిట్కు వచ్చారు. గాజువాకలో ఒక లాడ్జీలో గదిని తీసుకుని ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం లాడ్జీకి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున లాడ్జీ 4001 గది కారిడార్ వద్ద రక్తం మడుగులో వేణుగోపాల్రెడ్డి పడి ఉండటం చూసిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్ఐ భాస్కరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. లాడ్జీ గదిలోని బాత్రూమ్, హాలు, కారిడార్ వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. వేణుగోపాల్రెడ్డి ఎడమ చేయి మణికట్టుపై బ్లేడుతో కోసుకున్నట్లు గాయముంది. మెడ భాగంలోనూ కోసుకున్న ఆనవాళ్లున్నాయి. మృతుడి చేతిలోని బ్లేడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
అర్ధరాత్రి వరకూ గదిలో లైటు వెలిగే ఉందని హోటల్ నిర్వాహకులు చెబుతండటంతో, తెల్లవారుజామున ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బ్లేడుతో కోసుకున్నాక బాధ తట్టుకోలేక కారిడార్ లిఫ్ట్ వద్దకు వచ్చి పడిపోయి తీవ్ర రక్తస్రావానికి గురై మృతి చెందినట్లు సీఐ ఇమ్మానియేలు రాజు తెలిపారు.
వేణుగోపాల్ రెడ్డి చనిపోయే ముందు రాసుకున్న ఆత్మహత్య లేఖ పోలీసులకు లభించింది. తనకు ఈ ఉద్యోగం నచ్చలేదని, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నానని, మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని ఇందులో పేర్కొన్నారు.
Recommended Video
తమ్ముడ్ని బాగా చదివించాలని, తన మృతదేహాన్ని వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షలకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. తీవ్ర మనస్తాపం వల్లే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని సీఐ తెలిపారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య విషయాన్ని హన్మకొండలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు.