అయ్యప్పమాల: విద్యార్థిని చితకబాదిన హెడ్మాస్టర్
కర్నూలు: నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వీరంగం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయురాలు అతడ్ని చితకబాదారు. అయ్యప్ప మాల వేసుకున్న నీవు దెయ్యంలా కనిపిస్తున్నావని అతడ్ని దూషించారు.
ప్రధానోపాధ్యాయురు చితకబాదడంతో మణికంఠ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్ప భక్తులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళనకు దిగినవారు, పాఠశాలలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయ్యప్ప మాల వేసుకోవడం వ్యక్తిగత విషయమని విహెచ్పి నాయకులు పేర్కొన్నారు.
పాఠశాల బస్సు బోల్తా: 10మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట మండలం సుగ్గుపల్లి-వెలగలపన్నూరు గ్రామాల మధ్యలో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడికండ్రిగ మండలం కేంద్రంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన బస్సు శనివారం ఉదయం దొరవారిసత్రం మండలం తుంగమడుగు నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35మంది విద్యార్థులు ఉన్నారు. సూళ్లూరుపేట ఎస్ఐ గంగాధర్ ఘటనాస్థలిని పరిశీలించి గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.