ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి: కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం
అనంతపురం: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ల వేధింపులతో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఓబులదేవపురం చెరువు మండలం గండికోట వారిపల్లి గ్రామానికి చెందిన మధువర్థన్ రెడ్డి(16) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలిలా ఉన్నాయి.. 10 తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నెల్లూరు శ్రీగాయత్రి విద్యసంస్థల ప్రతినిధులు అతి తక్కువ ఫీజుతో అతన్నిఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్చుకున్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేశారు.
అంతేగాక, జులై 11న హాస్టల్లో ఉన్న మధును కొందరు సీనియర్ విద్యార్థులు దుప్పటి కప్పి చితకబాదారు. దీంతో అతని ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వెళ్లి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు మధు. చర్యలు తీసుకుంటామని చెప్పారే తప్ప, చర్యలు తీసుకోలేదు.
దీంతో మధు జులై 12న హోం సిక్ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి కళాశాలకు వెళ్లనని తండ్రికి చెప్పాడు. దీంతో తండ్రి ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది.
కళాశాలకు వెళ్లి మధు తండ్రి యాజమాన్యంతో మాట్లాడిన వారి తీరులో ఏలాంటి మార్పు రాలేదు. తనపై దాడి చేసిన విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగిస్తేనే అక్కడ చదువుకుంటానని మధు పట్టుపట్టాడు. దీంతో తండ్రి అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
కాగా, గురువారం సాయంత్రం కళాశాల సిబ్బంది మధు తండ్రితో ఫోన్లో మాట్లాడారు. మధును కళాశాలకు పంపించాలని లేకపోతే ముఖ్యమైన పాఠాలను కోల్పోతాడని చెప్పారు. దీంతో మధు తండ్రి తాను ఎంత చెప్పినా వినడం లేదని చెప్పారు. ఆ తర్వాత మధుతో కాలేజీ సిబ్బంది మాట్లాడారు.
ఫోన్లో మాట్లాడిన అనంతరం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు.. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. ఉదయం బావి దగ్గర అతని బైక్ కనిపించిందని సమాచారం అందుకున్న తండ్రి, తోటలోకి వెళ్లి చూసేసరికి మామిడి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు.
కళాశాల యాజమాన్యం తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ముందే చెప్పినా.. కళాశాల అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విద్యార్థి మృతి పట్ల కళాశాలలోని మృతుడి సహచర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.