ఆ టెక్కీ అన్నంత పని చేశాడు: ప్రకాశం బ్యారేజీలో తేలిన శవం
ఆ యువ టెక్కీ అన్నంత పని చేసి అతని కుటుంబంలో విషాదం నింపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరుడికి మెసేజ్ పెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జి. నాగసాయి(25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విజయవాడ: ఆ యువ టెక్కీ అన్నంత పని చేసి అతని కుటుంబంలో విషాదం నింపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరుడికి మెసేజ్ పెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జి. నాగసాయి(25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన నాగసాయి మృతదేహాన్ని వన్టౌన్ పోలీసులు సోమవారం గుర్తించారు.
'కృష్ణా నదిలో నా మృతదేహం తీసుకోండి': బెజవాడలో యువ టెక్కీ అదృశ్యం
ప్రకాశం బ్యారేజీ 42వ గేటు వద్ద యువకుని మృతదేహం ఉన్న విషయాన్ని నీటిపారుదల శాఖ ఉద్యోగి వన్టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రసాదంపాడుకు చెందిన మృతుని సోదరుడు సంతోష్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతునికి చెందిన మోటారు సైకిల్ను కూడా పోలీసులు దుర్గా ఘాట్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని సీజీఐ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నాగసాయి వారం క్రితం ప్రసాదంపాడులో నివాసముంటున్న తండ్రి నర్సింగరావు వద్దకు వచ్చాడు. శనివారం రాత్రి సోదరుడు సంతోష్కుమార్కు తన సెల్ఫోను నుంచి సంక్షిప్త సందేశం పంపాడు.
ఆ సందేశంలో కుటుంబసభ్యులను జాగ్రత్తగా చూసుకోమని, మోటారు సైకిల్ దుర్గా ఘాట్ వద్ద ఉందని సోదరుడిని కోరాడు. అంతేగాక, తన మృతదేహం ప్రకాశం బ్యారేజీ మధ్యలోని స్తంభం వద్ద ఉంటుందని సందేశంలో పేర్కొన్నాడు నాగసాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
ఆదివారం నాగసాయి కుటుంబసభ్యులు, పోలీసులు వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సోమవారం సాయంత్రం అతని మృతదేహాన్ని గుర్తించిన వన్టౌన్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుని ఒంటిపైన నలుపు రంగు ఫ్యాంటు, చొక్కాతోపాటు చేతికి వాచీ ఉంది.