పిల్లల్ని చంపేస్తా: భార్యకు టెక్కీ బెదిరింపులు, ఫిర్యాదు
హైదరాబాద్: వరకట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మేడ్చల్లో జరిగిన దారుణం చూశావు కదా.. పిల్లల్ని అలాగే చంపేస్తాను.. అప్పుడు నీ గతేమవుతుంది.. నువ్వు తట్టుకోగలవా..?' అంటూ భర్త బెదిరింపులకు భయాందోళన చెందిన మహిళ, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం లక్ష్మీనగర్కు చెందిన వీణ వివాహం 2008 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా తెనాలి మండలం చెరుకుపల్లికి చెందిన మలిపెద్ది రవికిరణ్తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 10లక్షల కట్నంతోపాటు 70 తులాల బంగారం, పెళ్లి ఖర్చులకింద మరో రూ. 3లక్షలు ఇచ్చారు. పుణె బేస్డ్ సాఫ్ట్వేర్ సంస్థలో రూ. 50వేల వేతనం అని చెప్పడంతో భారీ మొత్తం కట్నంగా ఇచ్చారు.
వివాహం అనంతరం నగరంలోని నిజాంపేట రోడ్డులోని ఓ అపార్ట్మెంటులో కాపురం పెట్టారు. తొలికాన్పులో ఆడిపిల్ల పుట్టడంతో భర్త నుంచి వీణకు వేధింపులు ప్రారంభమయ్యాయి. పలుదఫాలుగా వీణ తండ్రి శేషగిరిరావు సుమారు రూ. 22లక్షలు చెల్లించారు. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టడంతో భర్త పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయితే ఆ సంతోషం వీణకు ఎంతో కాలం నిలువలేదు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
వీణతోపాటు పిల్లలను కూడా తీవ్రంగా కొట్టేవాడు. రెండేళ్ల క్రితం వీణను, పాపను చంపేందుకు రవికిరణ్ ప్రయత్నించాడు. వీణ ఫోన్ ద్వారా మియాపూర్లో ఉండే బంధువులకు సమాచారం అందించి బయటపడింది. ఆ తర్వాత వేధింపులు తీవ్రం కావడంతో నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, స్వగ్రామంలో ఉంటున్న వీణకు.. రవికిరణ్ తరచూ ఫోన్ చేసి అదనపు కట్నం కోసం వేధించేవాడు.
పిల్లలిద్దరినీ చంపేస్తే నీ గతేమవుతుందని బెదిరించడంతో వీణ ఆందోళనకు గురైంది. అక్టోబర్ 6న అతడిని కలిసేందుకు భర్త పనిచేసే సంస్థకు వెళ్లగా నిర్వాహకులు ఆమెను లోపలికి రానివ్వలేదు. దీంతో ఆమె ఘట్కేసర్ పోలీసుల్ని ఆశ్రయించింది. వారి సూచన మేరకు స్వస్థలమైన మెదక్ జిల్లా పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.