వేధింపులు: రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
పశ్చిమగోదావరి: ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి శుక్రవారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరులోని హనుమాన్నగర్కు చెందిన రాజ్యలక్ష్మి, నవీన్ భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది.
భర్త నవీన్ తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కలహాలు: బ్రిడ్జిపై నుంచి దూకిన వివాహిత
విశాఖపట్నం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో శుక్రవారం చోటుచేసుకుంది. భీమిలి మండలానికి చెందిన కంచుబోయిన మౌనిక(22) అనే మహిళకు, ఆనందపురం మండలం లోడగలవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది.
పెళ్లయినప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మానసిక క్షోభను అనుభవిస్తున్న మౌనిక గత కొంత కాలంగా తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవితం మీద నిరాశతో శుక్రవారం భీమిలి మండలంలోని జాతీయ రహదారిలోని బ్రిడ్జిపై నుంచి దూకింది.
అదే సమయంలో ఆ ప్రాంతంలో ఇటుక పని చేసుకుంటున్న ఒడిశాకు చెందిన కూలీలు గమనించి ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.