అక్రమ సంబంధం: సూట్కేసులో మహిళ మృతదేహం
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట సంతగేటులోని ఎఎన్ఆర్ కాలనీ సమీపంలోని మురికినీటి కాలువలో పెద్ద సింథటిక్ సూట్కేసులో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఏఎన్ఆర్ కాలనీకి సమీపంలోని మురికినీటి కాలువలో పడివున్న పెద్ద బ్యాగ్ను కుక్కలు చుట్టుముట్టి లాగుతుండగా దానికున్న జిప్ ఊడి అందులో 30 నుండి 35 సంవత్సరాల వయస్సున్న మహిళ మృతదేహం బయటపడింది.
బ్లూ కలర్ జాకెట్, అదే కలర్ చీరపై తెలుపు రంగు పువ్వులున్న చీరను ధరించిన మహిళ మృతదేహం అందులో నుంచి బయటపడింది. ఆమె వివాహితురాలని తెలిపే ఆనవాళ్లు ఏవీ లభించలేదు. మెడలో మంగళసూత్రం, కాళ్ల మెట్లు, చెవిలో కమ్మలు, ముక్కర కనిపించలేదు. దీంతో ఈమె అవివాహిత అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం జరిగిన సంతకు వచ్చి ఉంటుందని, ఆ సమయంలోనే ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్నవారితో కలిసి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆమెతలపై బలంగా కొట్టడంతోనే మరణించి ఉంటుందని, మృతి చెందిన ఆమెను ఓ సూట్కేస్లో పెట్టి తీసుకువచ్చి మురికినీటి కాలువలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమీప ప్రాంతంలోనే ఈ హత్య జరిగివుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోక పోవడం గమనిస్తే శనివారం మధ్యాహ్నం తర్వాతనే ఈమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
అక్రమ సంబంధమే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి గాజులమండ్యం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమె స్థానికురాలు కాదని, తిరుచానూరు సమీపంలోని దామినేడు హౌసింగ్ కాలనీలో చూసినట్లు స్థానికులు కొందరు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.