ఐజి కూతురు పేరుతో పోలీసులకే టోకరా: కి‘లేడీ’ అరెస్ట్
కర్నూలు: ఏకంగా ఐజి కూతురు అని చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకే టోకరా ఇచ్చేందుకు ప్రయత్నించిన ఆ మహిళ, చివరకు వారికే దొరికిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బనగానపల్లె పోలీసులతో పరిచయం పెంచుకున్న సదరు మహిళ భర్తతో కలిసి తాను ఐజీ కూతురినని చెప్పి వారి దగ్గర నుంచి రూ.25వేలు డిమాండ్ చేసింది. అయితే ఆలస్యంగానైనా మేల్కొన్న పోలీసులు, తమదైన శైలిలో విచారించి కటకటాల్లోకి నెట్టారు.
కాణిపాకంలో రోడ్డు ప్రమాదం: తల్లీ కుమారుడు దుర్మరణం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి చెందగా భర్త, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్కూటర్ను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో స్కూటర్పై ఉన్న తల్లి భవిత, కుమారుడు ముఖేష్(2) మృతి చెందారు.
కాగా, ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల స్వస్థలం గుడిపాల మండలం రామభద్రాపురం గ్రామం. తల్లీకుమారుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కలుషితాహారం తిని.. 30 మందికి అస్వస్థత
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి హాస్టల్లో ఉన్న 60 మంది విద్యార్థులు గురువారం పప్పు, క్యాబేజి , కోడిగుడ్డులతో భోజనం చేశాక కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు.
స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్కుమార్ విద్యార్థులను పరామర్శించారు.