హృదయవిదారకం: తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి
కృష్ణా/ఖమ్మం: రాఖీ పండుగ ఓ ఇంట తీరని విషాదం నింపింది. ఓ ప్రమాదంలో సోదరుడు చనిపోగా.. అతని సోదరి కన్నీటితో అతడి మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ ఘటన అక్కడున్న వారందర్నీ కంటతడి పెట్టించింది.
ఘటనకుసంబంధించిన వివరాలా ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులోకి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో గల్లంతయిన కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్ (22) మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు.
వినోద్ కొందరు మిత్రులతో కలిసి ఈ చెరువు వద్ద స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు వచ్చినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిదిమంది జాలర్లు గాలించి అతడి మృతదేహాన్ని వెలికి తీశారు.
అతడి శవాన్ని చూడడంతోనే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల శోకం మిన్నంటింది. రాఖీ పండగ కావడంతో అతని సోదరి శిరీష తీరని దుఃఖంతో విలపిస్తూనే వినోద్ మృతదేహానికి రాఖీ కట్టడం అక్కడున్న కంటతడిపెట్టించింది. వినోద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.