ప్రియురాలు ఫిర్యాదు చేసిందని యువకుడి ఆత్మహత్య
మహబూబ్నగర్: ప్రియురాలు తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన జిల్లాలోని మిడ్జిల్ మండల పరిధిలోని తిమ్మన్నపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మృతుడు శివాజీ జడ్చర్లలోని బిపిడి కాలేజీలో పిఈటి కోర్సు చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలవారికి తెలియడంతో విభేదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో జనవరి 23న పెళ్లి చేసుకోవాలని శివాజీ వేధిస్తున్నాడని అతని ప్రియురాలు, ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శివాజీ ఆదివారం రాత్రి తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు
కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ఆదర్శ పాఠశాల విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగగానే డ్రైవర్ ఆటోను వదిలి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డైవర్ కోసం గాలిస్తున్నారు.