పెళ్లికి ముందు రోజు అదృశ్యం: శవమైన యువకుడు, అసలేం జరిగింది?
అనంతపురం: పెళ్లికి ముందు రోజు అదృశ్యమైన వరుడి జీవితం విషాదాంతమైంది. పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన అతడు మూడు రోజుల తర్వాత రైలు పట్టాలపై శవంగా కనిపించాడు. ఈ విషాద ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని పోచనపల్లికి చెందిన పవన్కుమార్ (27)కు వరుసకు మేనకోడలైన అమ్మాయితో వివాహం కుదిరింది. ఆగస్టు 16న ముహూర్తం నిర్ణయించారు.
చెప్పుల కోసం వెళ్లి..
అంతకు ఒకరోజు ముందు ఆగస్టు 15న ఉదయం 11 గంటల సమయంలో చెప్పులు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి హిందూపురం వచ్చాడు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఓ చెప్పుల దుకాణంలో చెప్పులు కొనుగోలు చేశాడు. వాటిని, తను వచ్చిన ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి, వెళ్లాడు. కాగా, ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో మంగళవారం సాయంత్రం వధూవరుల బంధువులు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రైలు పట్టాలపై శవమై..
పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు ఆ రోజు రాత్రి నుంచి అతని కోసం తీవ్రంగా వెదికారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. కాగా, అదేరోజు రాత్రి తిరుపతి రైల్వేస్టేషన్లో పవన్ గ్రామస్థులకు కనబడినట్లు తెలిసింది. విషయాన్ని పవన్ తల్లి రామలక్ష్మమ్మకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం హిందూపురం మండలంలోని కొటిపి గేట్ సమీపాన రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డు ఆధారంగా పోచనపల్లికి చెందిన పవన్గా గుర్తించి. గ్రామస్తులకు సమాచారమిచ్చారు. అతడి బంధువులు అక్కడికి చేరుకుని, శవాన్ని గుర్తించారు.
పారిపోయే అవసరం లేదు..
కాగా, వధువు తరపు ఖర్చులు కూడా తనే భరిస్తూ.. పోచనపల్లిలోనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న అతడికి పెళ్లికి ముందురోజు పరారవాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో అతడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతడే వెళ్లిపోయాడా.. ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అనుమానాలు..
రైలు పట్టాలపై పవన్ మృతదేహానికి సమీపంలోనే శుక్రవారం అనుమానాస్పద స్థితిలో నోటిలో మాంసం ముక్క పెట్టుకుని, కుక్క మృతి చెందడం గమనార్హం. పవన్ను ఎవరో దుండగులు కుట్ర పన్ని హత్య చేసివుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ మృతిపై అనుమానాలున్నట్లు కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, పవన్కుమార్ చాలా మంచివాడనీ, పెళ్లికి అతడే ఒప్పుకున్నాడనీ, పెళ్లికి ముందురోజే వెళ్లిపోయే అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయి బంధువులేమైనా ఇబ్బంది పెట్టి ఉంటారనీ, వారివల్లే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.