శ్రీహరికోటలో షార్: హెలికాప్టర్లో తిరిగి గుర్తించిన కలాం, శ్రీవారి ప్రసాదం ఇష్టం
అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగ జీవితాన్ని ఉమ్మడి ఏపీలో ప్రారంభించారు. డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా చేరిన ఆయన ఆ తర్వాత ఇస్రోకు బదలీ అయ్యారు.
ఈ క్రమంలో ఒక్క కేరళలోనే రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండేది. మరో కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. ఈ బాధ్యత కలాంకు అప్పగించారు. కేరళ నుంచి ఏపీ దాకా సముద్రతీరంపై హెలికాప్టర్ పైన ప్రయాణించిన కలాం ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటను ఎంపిక చేశారు.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) ఏర్పాటయింది. శ్రీహరికోటలో షార్ ఏర్పాటుకు కలాం అంకురార్పణ చేశారు. అక్కడి నుంచి తొలి రాకెట్ ప్రయోగం కూడా కలాం ఆధ్వర్యంలోనే జరిగింది. కేర్ ఆసుపత్రికి చాలాకాలం చైర్మన్గా ఉన్నారు.
రాష్ట్రపతి హోదాలో, ఆ తర్వాత ఆయన పలుమార్లు చిత్తూరు జిల్లాకు వచ్చారు. శ్రీవారి దర్శనం ఆయనకు ఇష్టం. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. శ్రీవారి ప్రసాదం ఆయనకు ఇష్టం. వేద విద్యార్థులు కనిపిస్తే పిలిచి మాట్లాడేవారు. 2002లో రాష్ట్రపతిగా తొలిసారి షార్కు వచ్చారు.
1969లో శ్రీహరికోటను రాకెట్ ప్రయోగ కేంద్రంగా నిర్ణయించారు. ఇస్రో స్వదేశీ, తొలి రాకెట్ ప్రయోగ విజయాలను కలాం షార్లోనే నమోదు చేశారు. 1971లో శ్రీహరికోటలో షార్ కేంద్రాన్ని నిర్మించారు. 1979లో తొలిసారి ఎస్ఎల్వీ 3 రాకెట్ ప్రయోగించారు. పిఎస్ఎల్వీ రూపకల్పనలో కలాం పాత్ర ఉంది.