బద్దలైన అవినీతి పుట్ట: ఏసీబీ చరిత్రలోనే భారీ అవినీతి 'పాము'.. (ఫోటోలు)!
సాధారణంగా ఒక ప్రభుత్వోద్యోగి సర్వీసు 30ఏళ్లు. అన్నేళ్ల సర్వీస్ తర్వాత కూడా ఒక స్థిరాస్థి కొనుగోలు చేయడానికి ఆపసోపాలు పడే ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ పాండురంగారావుకు మాత్రం 60స్థిరాస్థులున్నాయి.
అమరావతి: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి అనకొండ చిక్కింది. ఏసీబీ చరిత్రలోనే మునుపెన్నడూ పట్టబడని రీతిలో భారీగా అక్రమాస్తులు వెలుగుచూస్తుండటం అధికారులనే నివ్వెరపోయేలా చేస్తోంది. ఇప్పటిదాకా ఏసీబీకి పట్టుబడిన కేసుల్లో.. రూ.100కోట్ల నుంచి రూ.150కోట్లే అధిక మొత్తం కాగా.. తాజా కేసులో రూ.900కోట్ల దాకా అక్రమాస్తులు పట్టుబడటం సదరు అధికారి ఎంత అవినీతికి రుచిమరిగాడో అర్థమవుతోంది.
ప్రజారోగ్యశాఖ విభాగంలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న పాము పాండురంగారావు అనే అవినీతి నిర్వాకం ఇది.తాజా ఏసీబీ దాడుల్లో పాండురంగారావు అవినీతి పుట్టలు బద్దలవతున్నాయి. భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన పాండురంగరావు ఆస్తుల విలువ.. మార్కెట్ విలువ ప్రకారం.. రూ.900కోట్ల మేర ఉంటుందని అధికారులు నిర్దారించారు.
రిజిస్ట్రేషన్ కన్నా 50రెట్లు అధికం:
రిజిస్ట్రేషన్ విలువ కన్నా 50నుంచి 70రెట్లు అధికంగా వీటి విలువ ఉండటం గమనార్హం. విశాఖలోని పలు ప్రాంతాల్లో పాండురంగారావు భారీ ఎత్తున స్థలాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 20స్థలాల్లో పాండురంగారావు విశాఖలో భూకొనుగోలు చేయగా.. వీటి విలువే దాదాపు రూ.300కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆస్తుల చిట్టా:
ఏసీబీ చరిత్రలోనే ఇదో పెద్ద కేసుగా భావిస్తున్న అధికారులు.. బయటపడుతున్న ఆస్తులు చూసి నివ్వెరపోతున్నారు. హైదరాబాద్ లో ఉన్న పాండురంగారావు ఇల్లు, ఎకరం కమర్షియల్ స్థలం విలువ రూ.100కోట్లకు పైమాటే అంటున్నారు. దాంతో పాటు నగరంలోని మరో ఏడు స్థలాల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఇళ్లు, గుంటూరులోని 8 ప్రాంతాల్లో పాండురంగారావుకు స్థలాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. విశాఖపట్నంలోను ఎకరం వాణిజ్యం స్థలం ఉన్నట్లు తేలింది.
శుక్రవారం నాడు దాడులు:
శుక్రవారం ఉదయం తొలుత విజయవాడ సమీపంలోని తాడేపల్లి(గుంటూరు జిల్లా) నవోదయ కాలనీలోని పాండురంగారావు నివాసంలో ఏసీబీ అధికారులు తనఖీలు నిర్వహించారు. ఆపై ఏకకాలంలో విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్ సహా మొత్తం 11 ప్రాంతాల్లోని పాండురంగారావు ఆస్తులపై తనిఖీలు నిర్వహించారు.
ఉద్యోగుల ఫిర్యాదుతో వెలుగులోకి:
అవినీతికి రుచిమరిగిన పాండురంగారావు.. ప్రజారోగ్య శాఖలోని సిబ్బందిని ముడుపుల కోసం ముప్పుతిప్పలు పెట్టినట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టని పాండురంగారావు.. అందరి నుంచి ముడుపులు తీసుకున్నట్లు తెలిపారు. అతని వేధింపులు ఇక భరించలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు.
ఇన్ని స్థిరాస్తులా? ఎలా సాధ్యం..
సాధారణంగా ఒక ప్రభుత్వోద్యోగి సర్వీసు 30ఏళ్లు. అన్నేళ్ల సర్వీస్ తర్వాత కూడా ఒక స్థిరాస్థి కొనుగోలు చేయడానికి ఆపసోపాలు పడే ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ పాండురంగారావుకు మాత్రం 60స్థిరాస్థులున్నాయి. దీన్నిబట్టి ప్రతీ ఆర్నెళ్ల నెలలకొకసారి పాండురంగారావు ఒక్కో స్థిరాస్తిని కొనుగోలు చేస్తూ పోయారు. నివాసాలు, వాణిజ్య స్థలాలు.. వ్యవసాయ భూములు, మూడు కంపెనీలు.. ఇలా పాండురంగారావు ఆస్తుల విలువ అధికారులకే దిమ్మ తిరిగేలా చేసింది.
బంగారు నాణెలు:
పాండురంగారావు ఇంట్లో వజ్రాల హారాలతో పాటు బంగారు నాణెలు కూడా లభ్యమయ్యాయి. ఇంట్లో దేవుడి గదిలో వెలిగించే దీపాలు మొదలుకుని చాలావరకు వస్తువులు వెండివి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ పై సైతం.. అన్ని వెండి గ్లాసులు, వెండి కంచాలే ఉండటం గమనార్హం. వీటి బరువు సుమారు 10కిలోల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు.
కార్పోరేట్ ఆసుపత్రి కట్టి:
కేజీహెచ్ లో సూపరిండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.బి విజయ్ కుమార్, ప్రజారోగ్య శాఖలో ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ పాము పాండురంగారావు ఇద్దరూ కలిసి ఓ కార్పోరేట్ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. ఇంతలో ఏసీబీ వలకు చిక్కడంతో పాము పాండురంగారావు అవినీతి లీలలన్ని బయటపడుతున్నాయి.
క్లినిక్ లో బయటపడ్డ డాక్యుమెంట్స్!
కార్పోరేట్ ఆసుపత్రి నిర్మిస్తున్న స్థలం డాక్యుమెంట్స్, ఎంఓయూ పత్రాలు, కలెక్టరేట్ పరిధిలో విజయకుమార్ నిర్వహిస్తున్న క్లినిక్ లో లభించాయని ఏసీబీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. విజయ్ కుమార్ నివాసంతో పాటు మొత్తం 5చోట్ల సోదాలు నిర్వహించగా రూ.3.58కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భార్య కొడుకు పేరుతోను:
పాము పాండురంగారావుకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం, విశాఖ అశ్వని ఆస్పత్రిలో రూ.4 కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు. రైటన్, హెచ్ఎం అనే సాఫ్ట్ వేర్ సంస్థల్లోను భార్య, కొడుకు పేరుతో పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. సుధీర్&సునీల్స్ సోలార్ పవర్ ప్లాంట్ లో రూ.66లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తేలింది. రూ.9లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలో రూ.10లక్షలు, కేజిన్నర బంగారు నగలు, 9కిలోల వెండి రంగారావు ఇంట్లో గుర్తించినట్లు తెలుస్తోంది.