షాక్: ఆ అధికారి ఇంట్లో 2 కిలోల బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ సోదాలను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ సోదాలను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నవోదయకాలనీలో ఉన్న ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను గుర్తించారు. బంగారు నాణెలు, బిస్కెట్ల రూపంలో బంగారం, బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు లభ్యమయ్యాయి.
శుక్రవారం ఉదయం నుండి పాండురంగారావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి, హైద్రాబాద్ లోని 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 10 కేజీలకు పైగా వెండి ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్టు ఏసీబీ అధికారలుు తెలిపారు.
పాండురంగారావు సహా ఆయన కుటుంబసభ్యులు, బంధువుల పేరిట పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్టు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలోని బృందం గుర్తించిన ఆస్తుల విలువను లెక్కిస్తున్నారు.
మరోవైపు విశాఖపట్టణంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ రవికుమార్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ నాలుగు బృందాలుగా విడిపోయి రవికుమార్ తో పాటు ఆయన బంధువుల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు దాడులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సోదాల్లో రూ.65 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు తెలిసింది. విశాఖలోని నాలుగుచోట్ల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.పాండురంగారావుకు రవికుమార్ తో వ్యాపారసంబంధాలున్నాయని అంటున్నారు. వీరిద్దరూ కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.