ఘోర ప్రమాదం: కారుపైకి దూసుకెళ్లిన లారీ, ఐదుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును టిప్పర్ కొన్న ప్రమాదంలో నలుగురు చిన్నారులు తోపాటు డ్రైవర్ మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డు అధికారి మాచర్ల వీరాస్వామి తన మనవరాలు నిత్య(9 నెలలు) పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 12 మంది కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు మరమ్మతులకు గురికావడంతో కారులోని ముగ్గురు కిందికి దిగి ముందుకు తోసేందుకు యత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కిందనున్న ముగ్గురూ త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందులోని నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నాగరాజుతో పాటు శ్రీకృష్ణ(3), చిన్ని కృష్ణమనోహర్(5), చిన్ని కృష్ణ వాసవి(3), నిత్య(5) ప్రాణాలు కోల్పోయారు. వీరస్వామి, భార్య గంగమ్మ, కోడలు మాధవి, కుమార్తె లక్ష్మీప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.