చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురు మృతి, బాధితులను ఆదుకుంటామన్న బాలకృష్ణ
అనంతపురం: జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన ఆరుగురు తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం(ఏపి 02పి6945) దేవిరెడ్డిపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో రవి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. క్షతగాత్రులను 108లో కదిరి ప్రభుత్వ ఆస్రత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మురళి(56), చికిత్స పొందుతూ అనిల్(30) మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించిన నల్లచెరువు ఎస్సై నరేంద్ర భూపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం: బాలకృష్ణ
స్కార్పియో ప్రమాద మృతులకు హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్లో వైద్యులను కోరారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు.