చిలీలో మల్లి మస్తాన్ మిస్సింగ్, ఆచూకీకోసం యత్నం
హైదరాబాద్: ఏపీకి చెందిన పర్వతారోహకుడు మల్లిమస్తాన్ బాబు ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఎన్నారై, సమాచార పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
చీలీ - అర్జెంటినా మధ్య యాన్డ్స్ పర్వతారోహణకు వారం రోజుల క్రితం వెళ్లిన మస్తాన్ బాబు ఆచూకి తెలియడం లేదని, చీలీ, అర్జెంటినా ఇండియన్ ఎంబసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు సమాచారాన్ని పంపించామని చెప్పారు. మస్తాన్బాబు ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు.
ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మస్తాన్బాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కాగా, ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను 172 రోజుల్లో అధిరోహించి గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగెం మండలం గాంధీజనసంఘం గ్రామవాసి మల్లి మస్తాన్ బాబు అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.