నోరు జారిన అచ్చెన్నాయుడు: వైసీపీని 'సైకో పార్టీ'గా పెట్టుకోవాలంటూ సూచన
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. 15 నిమిషాల వాయిదా అనంతరం ప్రారంభమైన కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడం తగదని సూచించారు.
'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును.. సైకో పార్టీ'గా పెట్టుకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు.
అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో, వైసీపీ నిరసన తెలపటంతో 15 నిమిషాల పాటు సమావేశాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు షాక్ కొడుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైయస్ జగన్ అన్నారు.
దీనిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై తాము వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. 344 నిబంధన కింద నోటీసు ఇచ్చామని చెప్పిన జగన్ ధరల పెరుగుదలపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని స్పష్టం చేశారు.