కెసిఆర్ పాలన భేష్, అప్పుడేనా..: నటుడు సుమన్
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన బాగుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. రైతు సమస్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని ఆయన అన్నారు. నాలుగు నెలల్లోనే సమస్యలను పరిష్కరించడం ఏ ప్రభుత్వంతోనూ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో ఏటేటా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు సీఎం కేసీఆర్ సాయమందించాలనిఅన్నారు.
వరంగల్ జిల్లా మహబూబాబాద్లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలకు వ్యవసాయ నష్టంతో పాటు ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ప్రతి ఏటా కరువు ఎదురయ్యే పరిస్థితుల్లో ఆదుకునేందుకు ప్రత్యేక కార్డులు జారీ చేస్తే బాగుంటుందన్నారు.
ఆ కార్డులు కలిగిన అసలైన రైతులకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే మూడు నెలల కాలంలో నిత్యావసరాలు కల్పించడంతో పాటు ఆర్థిక సాయం చేస్తే రైతుల ఆత్మహత్యలు కొంత మేరకు నివారించవచ్చన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి తాను ప్రత్యేక తెలంగాణకు జై కొడుతూ వచ్చానని సుమన్ చెప్పారు.
వరంగల్కు చెందిన శ్యామల గణేష్ హీరోగా నటించి నిర్మించిన మిస్టర్ రౌడీ - వీడు లోకల్ సినిమా స్థానిక ముకుందా థియేటర్లో విడుదలను పురస్కరించుకొని సుమన్ ఇక్కడకు చేరుకున్నారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ నివాస గృహానికి వెళ్లి కాసేపు సేద తీరారు. ఆపై టీఆర్ఎస్ నేత డాక్టర్ పాల్వాయి రాంమోహన్రెడ్డి ఇంటికి వెళ్లి అల్పహారం చేసి అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ, ఫోటోలు దిగి ఉల్లాసంగా గడిపారు.
అక్కడి నుంచి నటుడు గణేష్, ఎమ్మెల్యే శంకర్నాయక్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ముకుందా ధియేటర్కు చేరుకొని సినిమా ముచ్చట్లను విలేఖరులు, అభిమానులకు చెప్పారు. చెడుపై మంచి సాధించే క్రమంలో గణేష్ నిర్మించిన సినిమా కథనం బాగుందని కితాబిచ్చారు.
ఎమ్మెల్యే శంకర్తో భేటి...
నటుడు సుమన్ - స్థానిక శాసన సభ్యుడు బానోతు శంకర్నాయక్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి అనుగుణంగా యువ ఎమ్మెల్యే అయిన శంకర్నాయక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలని సూచించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలు అందేలా ఎమ్మెల్యే స్వయం గా చొరవచూపాలన్నారు.