నన్ను చంపించే యత్నం, మైండ్ లేదు: జగన్పై ఆదినారాయణ సంచలనం
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తనను చంపించేందుకు యత్నించాడని ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
గాంధేయవాదాన్నే నమ్ముకొన్నా, నన్ను కాల్చి చంపండి: ఆదినారాయణరెడ్డి
అందుకే చంపాలని..
జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డిని తాను ఓడించానని.. అందుకే జగన్మోహన్ రెడ్డి తనను చంపించాలని చూస్తున్నాడని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. తాను దళితుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దళితులను అవమానించలేదని చెప్పారు.
Recommended Video
నేను చెప్పిందిదే..
దళితులు చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని తాను అన్నానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ చెప్పిన మాటలను తాను చెప్పానని తెలిపారు. జగన్ తాను ఏది అనుకుంటే అది జరగాలని కోరుకుంటున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసమే చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చారని ఆదినారాయణ రెడ్డి వివరించారు.
బుద్ధి, జ్ఞానం ఉందా?
చంద్రబాబుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబును కాల్చి చంపాలని, చెప్పుతో కొట్టాలని, ఉరితీయాలని జగన్ అనడం ఎంవరకు సమంజసమని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. జగన్ కు బుద్ధి జ్ఞానం లేకుండా పోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జగన్ మైండ్ పనిచేయడం లేదు
జగన్ మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. నంద్యాలలో జరిగిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఓ సినిమాలో అమ్రిష్పురితో జగన్ ను పోల్చారు ఆదినారాయణ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ కూడా ఏమీ చేయలేడని అన్నారు. నంద్యాల ప్రజలు తెలివైన వారని, టీడీపీని గెలిపిస్తారని అన్నారు.