మనవడి తలనీలాల కార్యక్రమం: నారావారి పల్లెకు చంద్రబాబు, 83 రోజుల తర్వాత ఏపీ సచివాలయానికి!
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు వస్తున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్కు రానున్న చంద్రబాబు సోమవారం ఉదయం వరకు ఇక్కడే ఉంటారు. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా రేణిగుంట విమానాశ్రయం వెళతారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తన సొంతూరు నారావారి పల్లెకి వెళతారు. మనవడు దేవాన్ష్ తలనీలాల కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు 83 రోజుల తర్వాత సచివాలయానికి రానున్నారు.
సెప్టెంబర్ 5న హైదరాబాద్లోని ఏపీ సచివాలయం ఎల్ బ్లాకులోని తన కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం చంద్రబాబు తిరిగి అక్కడ మరోసారి కాలుపెట్టలేదు. పాలనా సౌలభ్యం కోసం విజయవాడలోనే తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్న చంద్రబాబు దాదాపుగా అక్కడే ఉంటున్నారు.
క్యాంపు కార్యాలయాన్ని అమరావతి ప్రాంతానికి తరలించి, అక్కడినుంచే పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడో ఒకసారి హైదరాబాదు వచ్చినా ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటున్న ఆయన వెనువెంటనే తిరిగి విజయవాడ వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్కు వస్తున్న చంద్రబాబు 28వ తేదీన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉద్యోగుల తరలింపుతో పాటు వివిధ పథకాల అమలు, ఆదాయం వంటి విషయాలూ వీరిమధ్య చర్చకు వస్తాయని తెలుస్తోంది.
కాగా, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17 నుంచి జరుగనున్న నేపథ్యంలో, 18న షెడ్యూల్లో ఉన్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్ సైతం హైదరాబాద్ లోనే జరుగనుంది. దీంతోపాటు టీ టీడీపీ వ్యవహారాలపై ఆయన సమీక్ష చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.