ఎంపీలతో రాజీనామా ఎప్పుడు?: ఆశ్చర్యపోయిన జగన్, అడ్డంగా దొరికిపోయారా?
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చిన్న విషయమని, ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత రాజీనామా చేస్తామన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలకు ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టాయి.
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం రాజీనామా చిన్న విషయమని, ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత రాజీనామా చేస్తామన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలకు ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టాయి. హోదా కోసం రాజీనామా చేస్తానని ఇప్పుడు మాట తప్పుతున్నారంటున్నారు.
జగన్ వ్యాఖ్యలపై మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఎంపీలతో ఎప్పుడు రాజీనామాలు చేయిస్తారో జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ దోషి కాదు: పురంధేశ్వరి సంచలనం
ప్రధాని నరేంద్ర మోడీని కలవడాన్ని తాము తప్పుపట్టడం లేదని, అందులో రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. రెండు అంశాలు తప్ప మిగిలిన వాటి విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
హోదా కోసం నిన్నటి దాకా పట్టుబట్టిన జగన్ ఇప్పుడు కేసుల కోసమే దానిని పక్కన పెట్టారని అర్థమవుతోందని, ఆయన అడ్డంగా దొరికిపోయారని టిడిపి అంటోంది.
బాబు తప్పు చేస్తే..
కాగా, సోమవారం రాత్రి జగన్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తన అధికారంతో వ్యవస్థలను ప్రభావితం చేస్తుంటే ట్రంప్కో, అమెరికా గవర్నర్కో ఫిర్యాదు చేయలేం కదా అని, ప్రధానికే ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. మోడీ మంచివారని చెప్పిన అధికార పక్షం, ఆయన తనకు అపాయింట్మెంట్ ఇస్తే చెడ్డవారు అయ్యారా అని ప్రశ్నించారు.
ఆ లేఖ పాతదే, మోడీతో గంటసేపు మాట్లాడా
తాను ఫిబ్రవరి 17నే ప్రధానికి లేఖ రాశాననీ, చంద్రబాబు వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని ఆ లేఖలో ఫిర్యాదు చేశానని జగన్ చెప్పారు. దానికి ఏప్రిల్లో ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యుత్తరం కూడా వచ్చిందన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసి గంటసేపు మాట్లాడానని, సహజంగానే రాష్ట్రంలోని సమస్యలతో పాటు రాజకీయాలూ ప్రస్తావనకు వచ్చాయని చెప్పారు.
ప్రత్యేక హోదాపై.. ఆశ్చర్యపోయా
ప్రత్యేక హోదాపై పదిహేను నిమిషాలు మాట్లాడానని, ఆయన ఆసాంతం విన్నారని జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కొడుకు మీద వచ్చిన ఆరోపణలను తెలిపానని, మోడీ.. జగన్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారని, జగన్కు సమయం ఇవ్వడం తప్పా? నేను వెళ్లి సమస్యలు వివరించడం తప్పా? ఆశ్చర్యంగా ఉందని జగన్ అన్నారు. తనకైతే ప్రధాని కార్యాలయం నుంచి రాత్రి ఫోన్ వచ్చి ఉదయం అపాయింట్మెంట్ ఉందని చెప్పారని, దాంతో కలిశానని చెప్పారు. తాను వెళ్లి కలిసిన విధానమంతా పారదర్శకమే అన్నారు.
చంద్రబాబు ఎవరికీ కనపడలేదేం
చంద్రబాబు అమెరికా నుంచి రెండు గంటలకు ఢిల్లీ వచ్చి 11 గంటల వరకూ ఎవరికీ కనపడలేదని, ఆ సమయంలో ఎక్కడకు వెళ్లారు? ఎవర్ని కలిశారు? ఎందుకంత గోప్యమని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో మెయిళ్లను ప్రస్తావిస్తూ... ఎవరో కడుపు మండినవాళ్లే ఇచ్చి ఇంటారన్నారు.
కొంత సమయం ఇద్దాం
మోడీ ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశ ఉందని, కొంత సమయం ఇద్దామని, మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలంటే హోదా ఇవ్వాలని తాను ప్రధానికి చెప్పానని, లోకసభలో వైవీ సుబ్బారెడ్డి ప్రయివేటు బిల్లు పెట్టారని, రాజీనామాలనేది చిన్న విషయమని, ఆరు నెలల తర్వాతైనా చేయించవచ్చునని, ఒత్తిడి చేయకుండా రాజీనామా చేస్తే నష్టం మనకేనని, హోదాపై ఆరాటపడేదీ, చిత్తశుద్ధితో పోరాడేదీ ఎవరైనా ఒక్క జగనే అని గర్వంగా చెప్పగలనని అన్నారు. ఎన్నికల్లో ఇదీ ప్రధాన అంశం చేస్తామన్నారు. హోదా ఇచ్చేవారికే తమ మద్దతు అన్నారు.
ఏ ఈడీ అధికారి లేఖ ఇచ్చారో?
చంద్రబాబు అన్ని వ్యవస్థల్నీ, మీడియానీ ప్రభావితం చేస్తున్నారని, తాను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే వాళ్ల నుంచి సమాధానం కూడా వచ్చిందని, మే 10న కలిసేందుకు వెళ్తూ పాత లేఖ తీసుకువెళ్తానా? ఓ పత్రిక ఈ నెల 10న ఇచ్చిన లేఖను పక్కనపెట్టి ఫిబ్రవరి 17న రాసిన లేఖను ప్రస్తావించారని, మొదటి పేజీ అయితే తేదీ చూపించాల్సి వస్తుందని చివరి పేజీ వేశారని, ఏ ఈడీ అధికారి లేఖ ఇచ్చారో ఆ పత్రికే చెప్పాలని వ్యాఖ్యానించారు.