షా క్లాస్: బిజెపి నేతల యూ టర్న్, జగన్పై అనుకున్నది సాధించిన బాబు
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో నారా చంద్రబాబు ప్రభుత్వం తీరుపై పలువురు బిజెపి నేతలు రివర్స్ గేర్ వేస్తున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు పాలనపై వారు దుమ్మెత్తి పోశారు.
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో నారా చంద్రబాబు ప్రభుత్వం తీరుపై పలువురు బిజెపి నేతలు రివర్స్ గేర్ వేస్తున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు పాలనపై వారు దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు వేరేలా స్పందిస్తున్నారు.
చదవండి: ప్రత్యేక హోదాపై కౌంటర్ ఇచ్చిన అమిత్ షా
బిజెపి నాయకులు సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి వారు నిత్యం చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అంతేకాదు, టిడిపితో పొత్తు లేకుంటేనే మనకు లాభమని నిత్యం చెబుతుంటారు.
శుభమ్ కార్డ్
తాజాగా, చంద్రబాబు - అమిత్ షాలు గురువారం భేటీ అయ్యారు. పొత్తు అంశంపై చర్చించారు. మొత్తానికి పొత్తుపై సస్పెన్స్కు తెరదించారు. మరో రెండేళ్ల పాటు అయితే కచ్చితంగా మిత్రపక్షాలుగా ముందుకు సాగుతారు. పొత్తుపై శుభమ్ కార్డ్ పడింది.
బిజెపి నేతల యూటర్న్
అదే సమయంలో టిడిపిపై విమర్శలు చేసే బిజెపి నేతలకు పార్టీ పెద్దలు పలు సూచనలు చేశారని తెలుస్తోంది. మిత్రపక్షమైన టిడిపిపై విమర్శలు వద్దని సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు తగ్గుతున్నారని అంటున్నారు.
సోము వీర్రాజు ఆసక్తికరం
సీఎం చంద్రబాబు పాలనకు మార్కులు వేసేంత పెద్దవాడిని తాను కాదని సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి నేతల్లో ఈయన కూడా ముఖ్యులు. అలాంటి వీర్రాజు.. అంత పెద్దవాడిని కాదని చెప్పారు.
కావూరి మాత్రం విమర్శలు చేశారు
మిగతా వారి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు. ఢిల్లీ పెద్దలు క్లాస్ తీసుకోవడం వల్లే తగ్గి ఉంటారని అంటున్నారు. అమిత్ షాతో కలిసిన అనంతరం కావూరి సాంబశివ రావు మాత్రం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వారూ తగ్గవచ్చు
అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు మొదటి నుంచి తమను విమర్శిస్తున్నారనేది టిడిపి మొదటి నుంచి చెబుతోంది. మిగతా బిజెపి నేతలు విమర్శించడం లేదంటున్నారు. వీరు కూడా బాబు ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చునని అంటున్నారు.
పనిలో పనిగా జగన్పై అనుకున్నది సాధించిన బాబు
ప్రధాని మోడీతో భేటీ అనంతరం టిడిపి - బిజెపి పొత్తు వీడిపోతుందని జోరుగా ప్రచారం సాగింది. ఇది టిడిపికి ఇబ్బందికరంగా, వైసిపికి హ్యాపీకి కారణమయింది. అయితే అమిత్ షాతో భేటీ ద్వారా.. జగన్కు, వైసిపి ఆనందానికి చెక్ చెప్పాలనుకున్న చంద్రబాబు ఆశలు మాత్రం ఇప్పటికీ తీరాయి. త్వరలోనే పొత్తుపై తేలిపోతుందనుకున్న వైసిపి, కొందరు బిజెపి నేతల ఆశలను అమిత్ షా నీరుగార్చారని అంటున్నారు.