మేమే అధికారంలో ఉంటే..: చంద్రబాబుకు విష్ణు షాక్, గొంతు పెంచిన బిజెపి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు మరోసారి గొంతు పెంచారు. మద్యం పాలసీపై సోము వీర్రాజు అనంతరం, బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు మరోసారి గొంతు పెంచారు. మద్యం పాలసీపై సోము వీర్రాజు అనంతరం, బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: అసలు విషయం చెప్పిన ప్రశాంత్ కిషోర్
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ఇళ్ల పక్కన మద్యం పాలసీలు పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా, వారి ఇళ్ల పక్కన దుకాణాలు పెడితే అనుమతులు ఇస్తారా అని సవాల్ విసిరారు.
డబ్బులు కావాలా.. చంద్రన్న పథకం ఉందిగా
మద్యం పాలసీ కేవలం డబ్బు సంపాదనకే కనిపిస్తోందని విష్ణు కుమార్ నిప్పులు చెరిగారు. ఇది చాలా నీచమైన చర్య అన్నారు. ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే చంద్రన్న కానుకల ద్వారా నిధులు సేకరించవచ్చునని ఎద్దేవా చేశారు. జనావాసాల మధ్య మద్యం షాపులు సరికాదన్నారు.
బిజెపి అధికారంలో ఉంటే..
ఏపీలో బిజెపి కనుక అధికారంలో ఉంటే మద్యం షాపులే ఉండవని విష్ణు కుమార్ అన్నారు. అమాయక జనావాసాల్లో మద్యం షాపులు పెట్టడం దారుణమైన చర్య అన్నారు. జానావాసాల మధ్య మద్యం షాపులు పెడతారా అని నిలదీశారు. ఏపీలో మద్యం పాలసీని మార్చాల్సిందే అన్నారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం షాపుల కేటాయింపులు అన్నారు.
అవి ఆపేయవచ్చు కదా
రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకలను నిలిపివేసి, ఆ డబ్బును ఆసుపత్రులకు వినియోగిస్తే పేదోడికి మంచి జరుగుతుందన్నారు. ఏపీలో మద్యం పాలసీ తీరు మూడు బార్లు, ఆరు మద్యం షాపుల వలె ఉందన్నారు.
మహిళలు సీసాలు పగలగొట్టాల్సిన అవసరం లేదు
అంతకుముందు, మద్యం పాలసీపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రి జవహర్ కౌంటర్ ఇచ్చారు. మద్యం తమ ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదని, తమకెలాంటి లక్ష్యాలూ లేవన్నారు. మద్యం షాపులకు ఏ దేవుడి పేరు పెట్టడానికి వీల్లేదన్నారు. ఈ ఐదు రోజుల్లో ఎక్సైజ్ శాఖకు రూ.120 కోట్లు నష్టం వచ్చిందన్నారు. జనావాసాల మధ్య బార్లు, వైన్ దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వైన్ షాపులు మూసివేయాలని మహిళలు సీసాలు పగలగొట్టాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఫోన్ చేసి చెబితే సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరిగిందన్న సోము వీర్రాజు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.