ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీ: వర్షపు నీటిని ఎత్తిపోసిన సిబ్బంది..
తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం కార్యాలయంలోకి నీరు వచ్చి చేరింది.
అమరావతి: వెలగపూడిలోని ఏపీ సచివాలయాన్ని లీకేజీ బెడద వెంటాడుతూనే ఉంది. నెల క్రితం జగన్ ఛాంబర్ లీకేజీతో విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. దాని వెనకాల కుట్ర దాగుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై లీకేజీ వ్యవహారంపై ఓ కమిటీని కూడా నియమించారు.
జగన్ 'ఛాంబర్'కు చిల్లు: చిన్నపాటి వర్షానికే ఇంత అద్వాన్నమా?(ఫోటోలు)
ఇక తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం, మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్, మంత్రి దేవినేని ఉమా ఛాంబర్లలో వర్షపు నీరు లీకేజీ అయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి కురుస్తున్న వర్షానికి.. గ్లాస్ విండోల నుంచి, కొన్ని చోట్ల పై ఫ్లోర్ ల నుంచి వాటర్ లీకవుతోంది.
మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్ లో సీలింగ్ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి వర్షపు నీరు లీకవుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. వర్షపు నీటిని సిబ్బంది బకెట్లతో ఎత్తి పోస్తున్నారు.