ప్రత్యేక హోదా: జెసి ఇంటి ముందు చీరె, పూలు, జాకెట్లతో ధర్నా
విజయవాడ: ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు పురుడు పోసుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారంనాడు ఆందోళనలు జరిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అనంతపురం జిల్లాలోని ఎంపీ దివాకర్ రెడ్డి ఇంటి ముందు ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో టిడిపి పూర్తిగా విఫలమయ్యిందని వారు విమర్శించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ దివాకర్రెడ్డి నివాసం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ప్రజలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ముసుగులు ధరించిన నాయకుల బూట్లను పాలిష్ చేస్తూ ఆందోళనకారులు తమ నిరసనను తెలిపారు.
ఇదిలావుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుకోవాలని విజయనగరం జిల్లా సిపిఐ నేత కామేశ్వర రావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంద్రజిత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని కామేశ్వర రావు డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.