శుభవార్త: విజయవాడ నుండి అంతర్జాతీయ విమానాలు, ఏడాదిలో అంతర్జాతీయ టెర్మినల్ పూర్తి
అంతర్జాతీయ హోదాను అందిపుచ్చుకోవడంతో విజయవాడ విమానాశ్రయం నుండి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయానసంస్థలు ముందుకు వస్తున్నాయి.
విజయవాడ:అంతర్జాతీయ హోదాను అందిపుచ్చుకోవడంతో విజయవాడ విమానాశ్రయం నుండి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయానసంస్థలు ముందుకు వస్తున్నాయి.
విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దక్కింది. దీంతో అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానసర్వీసులను నడిపేందుకుగాను ఎయిరిండియా నుండి స్పష్టమైన హామీ వచ్చింది. ఆసియా దేశాలకు నడిపేందుకు ఎయిర్ ఏషియా సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
దేశీయ దిగ్గజ ప్రైవేట్ విమానాయాన సంస్థ ఇండిగో సానుకూలంగా ఉంది. అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.అయితే కోస్తా జిల్లాల నుండి లక్షలాది సంఖ్యలో ఎన్ ఆర్ ఐ లు ఉన్నందున అంతర్జాతీయ విమానాలు నడపడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నాయి విమానాయనసంస్థలు
కృష్ణా జిల్లాలో ప్రతి వంద ఇళ్ళకు ఒక ఎన్ ఆర్ ఐ ఉన్నట్టు అంచనాలున్నాయి. విదేశీ విద్య, ప్రాజెక్టు వర్క్స్ , ఉద్యోగాలు , ఉపాధి పొందటం వ్యాపార లావాదేవీలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ విమానసర్వీసులతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి ప్రతి ఏటా విదేశాలకు వెళ్తుంటారు. ఈ జిల్లాల పరిధిలోనే సుమారు ఆరు లక్షల మంది ఎన్ ఆర్ ఐ లు ఉన్నారని అంచనా. పర్యాటక స్థలాల సందర్శన కోసం కోస్తా జిల్లాల నుండి ప్రతి ఏటా భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తుంటారు. సింగపూర్, మలేషియా, థాయ్ లాండ్, హాంకాంగ్, శ్రీలంక, అమెరికా , యూరప్ , దుబాయ్ ,కువైట్, అస్ట్రేలియా వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారు.దీంతో అంతర్జాతీయ విమానసర్వీసులకు విజయవాడకు నడపడం ప్రయోజనమని భావిస్తున్నాయి విమానాయన సంస్థలు.
ఆఫ్రికా దేశాలకు వెళ్ళేవారు కూడ ఎక్కువే
ఈ ప్రాంతం నుండి విదేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఆఫ్రికా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య కూడ తక్కువేమీకాదు. ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాల్లో సహజవనరులు అపారంగా ఉంటాయి. ఈ రెండు జిల్లాల నుండి ఎక్కువగా ఖనిజవనరుల వెలికితీతకోసం లీజులు పొందిన వారు కూడ ఎక్కువగానే ఉన్నారు. ఆసియాదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్ళేవారి సంఖ్య కూడ తక్కువేమీకాదు.
విదేశీయుల రాకపోకలు కూడ ఎక్కువే
విదేశాల నుండి రాకపోకలు సాగించే విదేశీయుల సంఖ్య కూడ ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. జపాన్, సింగపూర్, మలేషియా, నార్వే, న్యూజిలాండ్, ఇటలీ, అమెరికా, చైనా, రష్యా, ఆఫ్రికా తదితర దేశాల నుండి వ్యాపార బృందాలు, పారిశ్రామిక బృందాలు తరలివస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాజధాని విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.అమరావతిలో పెట్టుబడులుపెట్టేందుకుగాను విదేశీ బృందాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఎయిర్ పోర్ట్ లో మెరుగైన వసతుల కల్పన
ఆంధ్రప్రదేశ్ కు నేరుగా విదేశీయులు రాలేని పరిస్థితి ఉండేది. హైద్రాబాద్ కు చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక బస్సులు, కార్లలో రావాల్సి వస్తోంది. హైద్రాబాద్ లోనే విదేశీయులకు అతిథ్యాన్ని ఇచ్చేవారు. విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణదశలో ఉన్నాయి.ఇరవై వరకు త్రీస్టార్, బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు జరిగాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ స్థాయి హోదా రావడం శుభపరిణామంగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ హోదా అందిపుచ్చుకొనేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ కూడ పూర్తి కావాల్సి ఉంది. రూ.516 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రతిపాదనలు సిద్దం చేశారు.