ఏపీ సిగలో మరో మణిహారం: అనంతలో ఎయిర్బస్ ప్లాంట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ రానుంది. విమానాల తయారీ సంస్ధ ఎయిర్బస్ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం 49.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, జీవో నం. 264ను జారీ చేసింది.
జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గోరంట్ల మండలం పాల సముద్రం గ్రామ సమీపంలో ఈ స్ధలాన్ని కేటాయించారు. ఇందుకు గాను ఎయిర్ బస్ సంస్ధ ఎకరానికి రూ. 5 లక్షల చొప్పున చెల్లించనుంది. ఈ స్ధలానికి ఆనుకొని ఉన్న మరో 150 ఎకరాల స్ధలాన్ని కూడా ఎయిర్ బస్ కావాలని కోరుతోందని సమాచారం.
అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 49.18 ఎకరాల స్ధలాన్ని ఎయిర్ బస్కు కేటాయించిన ప్రభుత్వం, మిగతా భూమిని త్వరలో అప్పగించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం కేటాయంచిన స్ధలం చుట్టూ కొంత ప్రైవేటు భూములు ఉన్నందున, వాటిని సేకరించేందుకు కొంత సమయం పట్టవచ్చని సీఎంఓ అధికారులు తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ పరిశ్రమతో రాబోయే రోజుల్లో మరెన్నో విడిభాగాల తయారీ యూనిట్లు కూడా తరలి వస్తాయని, తద్వారా ఏపీకి మరింతగా పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయని సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.