చంద్రబాబు అగ్రిమెంట్ రాసివ్వాలి: భూమా అఖిల ప్రియ
హైదరాబాద్/ అనంతపురం: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో అగ్రిమెంట్ చేయాలని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తనదే బాధ్యత అని చంద్రబాబు అగ్రిమెంట్లో రాయాలని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అలా రాసి సంతకం పెట్టిన అగ్రిమెంట్ ప్రతిని గవర్నర్కు సమర్పించాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం వెనక మంత్రుల వాటాలెంతో బయటపెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అంజాద్ బాషా, నారాయణ స్వామి డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఉండడానికే చంద్రబాబు పట్టి సీమ ప్రాజెక్టును తెర మీదికి తెచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురారెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికే ఆ ప్రాజెక్టును నిధులు కేటాయించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బిజెపికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాను రాబట్టడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ఇతర రాష్ట్రాలను ఎందుకు ఒప్పించలేదని ఆయన అడిగారు.
హంద్రీనివా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వై విశ్వేశ్వర రెడ్డి, చంద్ బాషా మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. హంద్రీనివా పూర్తి చేస్తే రాయలసీమలో ఆత్మహత్యలు తగ్గుతాయని వారన్నారు.
పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావిడి చేస్తున్నారో అర్థం కావడం లేదని వారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్తో జనవరి 28,29 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్లు వారు తెలిపారు.