నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు పెట్టారు: అఖిలప్రియ
కర్నూలు: పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు.
‘ఓటు వేయడానికి నేను, నాన్న కలిసి వెళ్లాం. నాన్న చిన్న పనిమీద బయటకు వచ్చారు. క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం. నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను' అని అఖిలప్రియ తెలిపారు.
‘నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలిసింది కూడా లేదు, అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్గా మాట్లాడారు. టిడిపి ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్గా మాట్లాడారు' అని ఎమ్మెల్యే అఖిలప్రియ చెప్పారు.
‘గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు. దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా.. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు. వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు' అని అఖిల ప్రియ ధ్వజమెత్తారు.
పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారని.. అక్కడ పోలీసులు మాట్లాడిన దానిపై తాము ఏమైనా చర్యలు తీసుకోగలమా? అని యోచిస్లున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు.
నియంత పాలన సాగుతోంది: ఎమ్మెల్యే నారాయణ స్వామి
ఆంధ్రప్రదేశ్ లో నియంతపాలన సాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ ద్వారా గెలుపొందాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికుట్రలు పన్నినా తమ పోరాటాలు ఆపలేరని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.