ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం: జగన్ పార్టీ అఖిల ప్రియనే
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆళ్లగడ్డ ఏకగ్రీవానికి మార్గం సుగమం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న భూమా అఖిల ప్రియ స్పందిస్తూ.. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శోభా నాగిరెడ్డి కలలను నెరవేరుస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగలేదు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు బుధవారం తిరస్కరణకు గురయ్యాయి.
స్వతంత్ర అభ్యర్థులు చాకలి పుల్లయ్య, విజయలక్ష్మి, బోయ చంటి, నాగమౌనిక రెడ్డిల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో లోపాలు ఉండటంతో ఎన్నికల అధికారులు ఈ నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
బుధవారం నాలుగు తిరస్కరణకు గురి కాగా, అఖిల ప్రియతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, మిగిలిన ఇద్దరు భూమా వర్గీయులేవే. ఈరోజు (అక్టోబర్ 24) వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతో.. మిగిలిన ఇద్దరు ఇప్పుడు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
కాగా, తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కొద్ది రోజుల క్రితం.. తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో చెప్పారు.
అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు. అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.