వారు టిడిపిలోకి వస్తారు: అఖిల, శిల్పా ఎఫెక్ట్.. రాజగోపాల్కు జగన్ ఊరట
నంద్యాలకు చెందిన ఐదుగురు సర్పంచ్లు, ఇద్దరు ఎంపిటిసిలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అఖిలప్రియ సోమవారం చెప్పారు. మండలానికి ఓ ఇంచార్జ్ ఇప్పుడే వద్దని ఆమె అభిప్రాయపడ్డారు.
అమరావతి: నంద్యాలకు చెందిన ఐదుగురు సర్పంచ్లు, ఇద్దరు ఎంపిటిసిలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అఖిలప్రియ సోమవారం చెప్పారు. మండలానికి ఓ ఇంచార్జ్ ఇప్పుడే వద్దని ఆమె అభిప్రాయపడ్డారు.
చదవండి: భూమా అఖిలప్రియ కుటుంబంలో విభేదాలు తేవాలని చూశారా?
ఆ తర్వాతే..
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నంద్యాల టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాగా, నంద్యాలలో పలువురు నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి సమక్షంలో యాభై మంది కార్యకర్తలు సొంత గూటికి చేరుకున్నారు.
జగన్ పార్టీపై చంద్రబాబు ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి సమన్వయ కమిటీ సోమవారం భేటీ అయింది. ఈ భేటీలో చంద్రబాబు ప్రతిపక్ష వైసిపిపై నిప్పులు చెరిగారు. సిట్టింగ్ అభ్యర్థి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైసిపి తుంగలో తొక్కిందని ఆగ్రహించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేలా పని చేయాలని నేతలకు హితవు పలికారు. కాగా, ఉప ఎన్నికల బాధ్యతను చంద్రబాబు కాల్వ శ్రీనివాసులు, సుజనా చౌదరి, నారాయణలకు అప్పగించారు.
రాజగోపాల్ రెడ్డికి జగన్ ఊరట
శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడం, ఆయనను నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడంపై నిన్నటిదాకా ఇంచార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అయితే, ఆయనకు వైసిపి అధినేత జగన్ కొంత ఊరట కలిగించారు. ఆయనను వైసిపి రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా నియమించారు.
జాగ్రత్తపడిన జగన్
నంద్యాలలో పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి ఆశించారు. కానీ భూమా కుటుంబాన్ని ఎదుర్కోగలిగిన శిల్పాను పార్టీలో చేర్చుకొని ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రాజగోపాల్ అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఉప ఎన్నికల సమయంలో ఆయన అలక వహించకుండా జగన్ ముందు జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు.