శిల్పాపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు, ఆయన వెళ్లినా మాకు వీరున్నారు: కాల్వ
నంద్యాలలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మంగళవారం అన్నారు.
కర్నూలు: నంద్యాలలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మంగళవారం అన్నారు.
చదవండి: బాబు 'సర్వే' రివర్స్: జగన్ ఎదుట శిల్పా ఇలా.., అఖిలప్రియకు చెక్
శిల్పా మోహన్ రెడ్డితో తమకు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని ఆమె స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో తాము నంద్యాలను అభివృద్ధి చేసి తీరుతామని అఖిల అన్నారు. అందరికీ పక్కా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
శిల్పా మోహన్ రెడ్డి రేపు (బుధవారం) వైసిపిలోకి వెళ్తున్న నేపథ్యంలో నంద్యాల టిడిపి కార్యకర్తలతో మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
శిల్పాపై అఖిల సంచలన వ్యాఖ్యల
నంద్యాలలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు అధికారులపై శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. శిల్పా టిడిపి నుంచి వెళ్తే తొలుత ఊపిరి పీల్చుకునేది అధికారులేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, శిల్పాను మేం ఇబ్బంది పెట్టామని ఆయన చెబుతున్నారని, ఇది హాస్యాస్పదం అన్నారు.
మాకు నాయకులు ఉన్నారు: కాల్వ
శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా ఎలాంటి నష్టం లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసిపి మునిగిపోయే నావ అన్నారు. ఆ పార్టీలోకి వెళ్తే శిల్పా మోహన్ రెడ్డియే రాజకీయంగా నష్టపోతారని జోస్యం చెప్పారు. టిడిపికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. మూడేళ్లు టిడిపిలో ఉన్న శిల్ప బయటకు వెళ్తే పోయేదేం లేదన్నారు. 30 ఏళ్లు టిడిపిలో ఉన్న భూమా కుటుంబం, ఎస్పీవై రెడ్డి, ఫరూక్ అండగా ఉన్నారని చెప్పారు.
శిల్పా అవివేకం
నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం లేదా ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. భూమా ఆశయం మేరకు నంద్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎప్పుడు మూసేస్తారో తెలియని వైసిపిలోకి వెళ్లడం అవివేకం అన్నారు.
అధిష్టానం టిక్కెట్ ఇచ్చిన వారికి మద్దతు: ఎస్పీవై రెడ్డి
శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారితే జిల్లాలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఎస్పీవై రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరికి టిక్కెట్ ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
అంతకుముందు..
అంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలప్రియ తమను ఇబ్బందులకు గురి చేసిందని, అధిష్టానానికి చెప్పినా తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదన్నారు.