నంద్యాలపై పట్టువీడని అఖిలప్రియ: రంగంలోకి సుజనా చౌదరి
నంద్యాల అసెంబ్లీ టికెట్ విషయంలో మంత్రి అఖిలప్రియ పట్టు వీడినట్లు లేరు. శిల్పా వర్గంతో ఆమె వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో సుజనా రంగంలోకి దిగారు.
కర్నూలు: నంద్యాల అసెంబ్లీ సీటు తమ కుటుంబ సభ్యులకే కేటాయించాలనే విషయంలో మంత్రి భూమా అఖిలప్రియ తన పట్టు వీడలేదు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. సంప్రదాయ ప్రకారం తెలుగుదేశం పార్టీ నంద్యాల టికెట్ బూమా కుటుంబ సభ్యులకే కేటాయించాలి.
కానీ, నంద్యాల టికెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతూ, తనకు టికెట్ ఇవ్వకపోతే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి దూకుతానని బెదిరిస్తున్నారు. దీంతో నంద్యాల టికెట్పై తెలుగుదేశం పార్టీలో పీట ముడి పడింది.
సమస్యను పరిష్కరించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇరు వర్గాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.
అఖిల ప్రియ అలా చెప్పినప్పటికీ..
నంద్యాల టికెట్ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని మంత్రి అఖిల ప్రియ ప్రకటించినప్పటికీ లోలోపల ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించేందుకు టీడీపీ కసరత్తులు మొదలు పెట్టింది. పార్టీకి చెందిన పెద్దలు రెండు వర్గాలతోనూ భేటీ టిడిపి నేతలు భేటీ అయ్యారు.
కళా వెంకట్రావుతో భేటీ..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుతో అఖిల ప్రియ, ఎస్వీ మోహన్రెడ్డి, ఎస్పీవైరెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూఖ్ భేటీ అయ్యారు. భూమా కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని ఎన్ఎండి ఫరూక్, ఎస్పీవై రెడ్డి వాదిస్తున్నారు. నంద్యాల లోకసభ సీటు నుంచి వైసిపి తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.
రంగంలోకి దిగిన సుజనా చౌదరి...
నంద్యాల టికెట్పై ఇరు వర్గాల మధ్య విభేదాలు పొడసూపి వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి, టిడిపి సీనియర్ నేత సుజనా చౌదరి రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య అవగాహనకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా, ఫరూక్, ఎస్పీవై రెడ్డి గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
చంద్రబాబుతో ఇరు వర్గాల భేటీ...
సుజనాచౌదరి, కళా వెంకట్రావులతో చర్చలు ముగిసిన తర్వాత భూమా, శిల్పా వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నాయి. అఖిలప్రియకు నచ్చజెప్పి శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అఖిలప్రియ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.