రాబింగ్హుడ్: బాబు ప్రభుత్వంపై భూమా అఖిలప్రియ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఆమె గురువారం అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్పై వ్యాట్ పెంపుపై మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించడంతో సామాన్యులపై పెనుభారం పడుతోందని అన్నారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా వ్యాట్ విధిస్తోందని ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారని భూమా అఖిల ప్రియా చెప్పారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు.
రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని...ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని... ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.
ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్ పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకహోదా కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు.