ఒక్కో ఎమ్మెల్యేకు 40 కోట్లు: 'ఆధారాలున్నాయి, సరైన సమయంలో బయటపెడతా'
అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనాపాటి అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు నాలుగో అభ్యర్ధిని గెలిపించుకునే సంఖ్యా బలం లేకున్నా పోటీలో నిలబెట్టేందుకు టీడీపీ సిద్ధమైందన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు టీడీపీ రూ. 30 నుంచి రూ. 40 కోట్లు ఇస్తోందని విమర్శించారు. ఈ కొనుగోలుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే సిద్ధమయ్యారని, అంత డబ్బెక్కడని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు, విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.
తన నియోజకవర్గంలో ఒక్కో ఎంపీపీ కొనుగోలుకే రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని, వాటిని సరైన సమయంలో బయటపెడతామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనగలరేమో గానీ, ప్రజలను కొనలేరని ఆయన అన్నారు.
సీఎం హామీపై మాజీ మంత్రి పుష్పరాజ్ హర్షం
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ సీటు కేటాయిస్తే తనకే అవకాశం ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబుతో మంత్రి పుష్పరాజ్ సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడి హామీపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీకి వచ్చే మూడు సీట్లలో మిత్ర ధర్మంలో భాగంగా బీజేపీకి ఒక సీటు టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సీటులో బీజేపీ కేంద్ర రైల్వే శాఖ మంత్రిని రాజ్యసభకు నామినేట్ చేయనుంది.
మరోవైపు మిగిలిన రెండు సీట్లలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ పేర్లను ఖరారు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిగా మాజీ మంత్రి పుష్పరాజ్కు సీటు రావడం దాదాపు కష్టమేనని అంటున్నారు.